ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

22, సెప్టెంబర్ 2010, బుధవారం

కృష్ణరాయని కీర్తి


మ.అల పోత్రిప్రభు దంష్ట్ర భోగివర భోగాగ్రాళిఱా లుద్భటా
చలకూటోపలకోటి రూపుచెడ నిచ్చల్ రాయగానైన మొ
క్కలు భూకాంతకు నున్ననయ్యె నరసక్ష్మాపాలు శ్రీకృష్ణరా
యల బాహామృగనాభి సంకుమద సాంద్రాలేప పంకమ్మునన్
(మను-ప్ర-౩౫)


{పోత్రిప్రభుడు - పందిరాజు; అనగా ఆదివరాహం; దంష్ట్ర - కోర; భోగివర - సర్పరాజు అనగా ఆదిశేషుని; భోగాగ్రాళిఱాలు - పడగచివళ్ళ యొక్క సమూహమందలి రత్నాలు; ఉద్భటాచలకూట - భయంకరమైన పర్వతాల కూటములందలి; ఉపలకోటి - రాళ్ళసమూహము; నిచ్చల్ - నిత్యమూ; రూపుచెడ - రూపము పాడయ్యేట్లు; రాయగానైన మొక్కలు భూకాంతకు - ఒరిపిడి పెట్టగా భూమికి పడ్డ గంట్లు; నరసక్ష్మాపాలు శ్రీకృష్ణరాయల - నరసరాయల కుమారుడైన శ్రీకృష్ణరాయల; బాహా - చేతులకు పూసుకున్న; మృగనాభి - కస్తూరి; సంకుమద - జవ్వాది; సాంద్ర+ఆలేప - చిక్కనైన పూతగా ఉన్న; పంకమ్మునన్ - బురదచేత; నున్ననయ్యె - నున్నగా అయ్యాయట!}

ఇదీ మనుచరిత్ర అవతారికలోని పద్యమే....పెద్దన్నగారు మొదట ఇష్టదేవతాస్తుతి,గురుస్తుతి చేసి,పూర్వకవుల్ని ప్రస్తుతించి,రాయలవారు తనని మార్కండేయ పురాణంలోని ఈ "స్వారోచిష మనుసంభవాన్ని" కావ్యంగా రాయమని కర్పూర తాంబూలమిచ్చి అర్థించారనీ చెప్పి, కృతిపతియైన రాయలవారి వంశానుక్రమం అద్భుతంగా వర్ణిస్తారు...తర్వాత రాయలవారి ప్రతాపాన్నీ,కీర్తినీ వర్ణిస్తూ ఆ క్రమంలో చెప్పిందే ఈ పద్యం........

ఆదివరాహం తనకోరలమీద భూమిని మోస్తూ ఉంటుంది...ఆదిశేషువు కూడా తన పడగలమీద భూమిని మోస్తూ ఉంటాడు....ఇవి పురాణకథలు...పర్వతాలు భూమిని వ్రీలి(చీలి)పోకుండా బిగిసేట్టు పట్టుకుని ఉంటై.ఇది ఇప్పటి మన ప్రకృతిశాస్త్రానికి తెలియని ఒక మహావిషయం...ఈ మూడూ భూమిని ధరిస్తున్నాయని చెప్తారు. పర్వతాలకి ’భూధరాల’నే పేరు!.....ఈ మూడూ నిత్యం ఒరిపిడి పెట్టటంవల్ల, గుండ్రంగా ఉన్న భూమిలో గంట్లు పడ్డాయట..అంటే బొత్తలు బొత్తలుగా అయిందన్నమాట!రాజుని భూమికి భర్త, పతి అంటారు.రాజుకి భూమి భార్య - భార్యని భర్త కౌగిలించుకుంటాడు. ఆ సమయంలో, అప్పటి భర్త అయిన కృష్ణరాయలు, తన చేతులకి రాసుకున్న కస్తూరి జవ్వాది బురదలాటి పూత ఆ భూదేవి మేని గంట్లలోకి చొచ్చి అవి పూడిపొయ్యాయని అర్థం...

ఇలాంటి కల్పనలు మన కావ్యాలలో సమృద్ధిగా ఉంటై.నిజంగా చూస్తే దీనికి అర్థంలేదు...కాని దీంట్లో ఒక మహార్థం ధ్వనితమవుతుంది,ప్రాధాన్యత దానికి.ఆయన ప్రజలు సుఖపడేట్లు రాజ్యపాలన చేశాడని దీనిలో ధ్వని.అది లేకపోతే ఎందుకూ పనికిరాని పద్యం ఇది...కాని పురాణకథానుసంధానం చేత, కవి చేసిన కల్పనాచాతుర్యం చేత పాఠకులకి ఆనందం కలిగిస్తుంది...

పద్యం రచించే నేర్పువల్ల అధికానందం కలుగుతుంది..రచించటం అంటే ఒకటి అక్షర సన్నివేశ చారుత్వం.రెండవది, మాటల కూర్పులో నేర్పు. భోగాగ్రాళి తర్వాత ’రాలు’-తెలుగుమాట;’రూపుసెడ’-తెలుగుమాట; ’నిచ్చల్ రాయగానైన మొక్కలు నున్ననయ్యె’- ఇవన్నీ తెలుగుమాటలు. ప్రోతి ప్రభుదంష్ట్ర; భోగివర భోగాగ్రాళి; ఉద్భటాచల కూటోపలకోటి; ఇలాంటి క్లిష్టమైన సంస్కృత శబ్దాలు కొన్ని సమాసాలు....వాటిని,వీటిని కలిపి గ్రుచ్చియెత్తటంలో ఒక రచనా సౌందర్యం ఉంది.....ఒక విలక్షణమైన శైలీ మాధుర్యం ఉంది. చివరి పాదంలో ఉన్న మధురసమాసం, పద్యానికి ఎంతో సౌందర్యాన్నిస్తోంది...ఈ లక్షణాలచేత, ఈ పద్యం ప్రౌఢి,మాధుర్య,సౌకుమార్య గుణాల కలయికతో ధగద్ధగాయమానంగా ఉంది....ఈ రచనలో తెనాలి రామకృష్ణయ్య లక్షణం కొద్దిగా కనిపిస్తుంది...శ్రీనాథుడి కొన్ని గడుసు రచనల్లోని వాసన ఉంది...

ఇది ఒక లోకోత్తరమైన పద్యం - శైలి చేత.ఈ కల్పనలందరూ చేసేదే - వెనుకనున్న పురాణ కథల చేత!కాని పెద్దన్న గారి ఈ రచనలో ఒక వైశిష్ట్యముంది.అదేంటంటే..........ఇక్కడ పోత్రి, భోగి, అచలం, ఈ మూడు శబ్దాలచేత మూడు వేఱు వేఱు విషయాలు ధ్వనిస్తున్నాయి.....

పోత్రం అన్న శబ్దానికి రెండర్థాలున్నై. ఒకటి పంది ముట్టె; రెండోది నాగలి కొన; పోత్రము కలది పోత్రి. అది పంది కావచ్చు, నాగలి కావచ్చు.....కాబట్టి ఇక్కడ విశేషార్థం ఏమిటంటే, నాగలితో పొలందున్నుకు బ్రతికే వాళ్ళు కృషికులు.దుష్టులైన రాజులు రైతుల్ని పన్నులెక్కువ వేసి బాధిస్తారు..అందువల్ల పంటలు తగ్గిపోతాయి.ఇది ఒక గంటు భూమికి...

భోగి కి కూడా రెండర్థాలు. భోగము అంటే పడగ; అది కలది భోగి-పాము; భోగమంటే ఇంకొక అర్థం ధనవంతులు అనుభవించే సుఖం - అది అనుభవించేవాడు భోగి.మహాధనవంతులుంటారు.వాళ్ళ దగ్గర రత్నాలుంటై. రాజుకి రత్నహారి అని పేరు. వాళ్ళ రత్నాలని రాజు లాక్కుంటాడు.అలా ఎక్కువ ధనం తీసుకోటంవల్ల వాళ్ళ భోగాలు చెడిపోతయ్యి.ఇది ఇంకొక గంటు.......

అచలం అంటే పర్వతం. అచలుడు అంటే చలించనివాడు.దేనికీ నివ్వెరపోనివాడు,కష్టపెట్టుకోనివాడు అచలయోగి అనబడతాడు. ఆ అచలయోగులకి ఏదీ పట్టదు.వాళ్ళకి ఏది ఎలా పోయినా సరే! కాని రాజులు వాళ్ళని కూడా హింసిస్తారు.వాళ్ళని యోగమార్గాన పోనివ్వరు.ఆ యోగులు ఆస్తికులు,ధర్మాన్నే విశ్వసిస్తారు..కాని కృత్రిములైన ఈ రాజులు,నాస్తికులు. వీళ్ళు విశ్వసించే విషయాలతోటి యోగుల్ని బాధిస్తారు..శిక్షిస్తారు...

పూర్వపు రాజుల్లో ఈ లక్షణాలున్నాయి, కాని కృష్ణరాయలందు లేవు అని అంతరార్థం....అంతేకాదు, ఇతని చేతులకి పూసుకున్న కస్తూరి జవ్వాది లేపనాలతో భూదేవికి గంట్లు నున్ననైనవంటే, పూర్వపు రాజులు చేసిన అన్యాయాల్ని రాయలు సరిదిద్దాడని అర్థం...ఇంకా, అది మృగనాభి సంకుమదాలేపం కనుక, ఆ పూత భూమికి రాసుకుంది కాబట్టి ప్రజలు భోగాలు అనుభవిస్తున్నారనీ అర్థం చేసుకోవచ్చు.......

మహాకవుల కల్పన ఇలా ఉంటుంది.- ఇలానే ఉండవలె..........

6 కామెంట్‌లు:

  1. శాన్నల్ల క్రితం, దీన్ని సాహిత్య సురభి లో చదివినట్టు గుర్తు.

    మంచి పద్యాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. @కొత్తపాళీ గారు,
    ధన్యవాదాలు....

    @wit real గారు,
    అవునండీ..ఇది గురువుగారు సాహిత్యసురభిలో చెప్పిందే!కొద్దిపాటి మార్పులతో మొత్తం గురువుగారు చెప్పిందే రాసేశానండీ!

    రిప్లయితొలగించండి
  3. అందుకే చౌడప్పలాటి కవి కూడా "పెద్దనవలె కృతి చెప్పిన పెద్దనవలె" అన్నాడు.
    శబ్ధ వివరణ చక్కగా ఉంది

    రిప్లయితొలగించండి
  4. మంచి పద్యాన్ని తెలియజేసి దాని అర్థాన్ని సులభ శైలిలో వివరించినందుకు కృతజ్ఞతలు కౌటిల్య గారు

    రిప్లయితొలగించండి