ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

22, ఆగస్టు 2010, ఆదివారం

అల్లసాని పెద్దన - ఆంధ్ర కవితా పితామహుడా?? ఎలా???


పెద్దన్నగారికి "ఆంధ్ర కవితా పితామహు"డని బిరుదు..కాని పెద్దన కంటె పూర్వులు తెలుగులో చాలామంది ఉన్నారు..కవిత్రయము,నాచన సోమన్న,శ్రీనాథుడు,పోతన్న మొదలైన మహానుభావులు చాలామంది ఉన్నారు...అసలు కవిత్రయంలో ఒకడైన ఎఱ్ఱాప్రెగడకి "ప్రబంధ పరమేశ్వరు"డన్న బిరుదుంది....మరి అలాంటప్పుడు పెద్దన్నగారికి ఆంధ్రకవితా పితామహుడన్న బిరుదు ఎలా వచ్చిందో, ఎలాగ చెల్లుబడైందో ఇక్కడ మనం విచారించవలసిన విషయం..........

అసలు ఈ బిరుదు పెద్దన్నగారికి శ్రీకృష్ణదేవరాయల వారిచ్చినది....కృష్ణరాయడు విద్వత్ప్ర్రభువు,భావుకుడు, సహజంగా గొప్పకవి..మరి ఆ ప్రభువుకి ముందు మహామహులున్నారని తెలియదా? శ్రీనాథుడున్నాడని తెలియదా? నాచన సోమన్న ఉన్నాడని తెలియదా? పెద్దన్నకి ఈ బిరుదివ్వటమేంటి? తాను చక్రవర్తి గనుక తన కభిమానుడైన కవికి ఈ బిరుదిచ్చాడా? తాను వైష్ణవ ప్రభువు. పెద్దన్న కూడా వైష్ణవుడే. మరి ఈ అభిమానంచేత ఇచ్చాడా? లేదా, "ఆంధ్ర కవిత" అంటేనే, కృష్ణరాయని అభిప్రాయం వేరా????...

ఇన్ని ప్రశ్నలు పుడతాయ్!! లౌకికమైన కారణాలు ఇక్కడ పొసగవు..విప్రతిపత్తు లెన్నైనా చెప్పుకోవచ్చు....

ఒక భాష ఉందనుకుందాం....దానికి గొప్ప సారస్వతం ఉందనుకొందాం....ఆ సారస్వతం వృధ్ధిపొందే లక్షణాలలో కొన్ని దశలుంటై.....వాటిలో ప్రథమదశ పురాణదశ. రెండవది కావ్యదశ....కవిత్రయం, నాచన సోమన్న, పోతన్న మొదలైనవారిది పురాణదశ....వీళ్ళంతా సంస్కృత కావ్యాలని తెలుగు చేశారు... శ్రీనాథుడు ఈ పురాణదశలో చివరివాడు...కాని ఆయన రాసిన "శృంగార నైషధము" దానంతట అది కావ్యం...అది అనువాదమే కాని, స్వతంత్ర గ్రంథం కాదు....

అదలా ఉంచితే, అల్లసాని పెద్దన్న మనకి ఆంధ్రభాషలో మొట్టమొదట స్వతంత్రకావ్యం రాసినవాడుగా కనపడతాడు...."మనుచరిత్ర" అనువాదం కాదు...మార్కండేయ పురాణంలోని ఒక కథ తీసుకుని దానిని స్వతంత్ర కావ్యంగా నిర్మించాడు....కాని పూర్వపు కవుల తెలుగుసేత కూడా మరీ మక్కికి మక్కిగా ఉండదు..కాబట్టి 'ఇదే' ఆంధ్రకవితా సమారంభమనటానికి, రాయలవారి బుద్ధిలో ’పద్యరచన’ అనికాదు...తెలుగుసేత అనీ కాదు..’స్వతంత్ర కావ్యం’ అని అనిపించుకోదగ్గ ఆంధ్ర పద్యగ్రంథం అని నిర్ణయం చేసుకోవచ్చు.....అసలిక్కడ ప్రాధాన్యత ’కావ్య’ శబ్దానికి...కావ్యలక్షణాలని పట్టిస్తే మనుచరిత్రే ప్రథమ కావ్యం...ఒక గ్రంథాన్ని కావ్యంగా నిర్ణయించాల్సి వచ్చినప్పుడు ప్రసిధ్ధమైన మార్గం ఒకటుంది...అది ఏకరసాశ్రయమైన కథ..ఇక్కడిది శృంగార రసము...

అసలుకి ఈ గ్రంథం పేరు "స్వారోచిష మనుసంభవం"...కాని మనుచరిత్రయని అలవాటైంది..ఆ పేరే చెల్లుబడౌతున్నది....ఒక మహావిషయాన్ని స్థాపించటానికి తొట్టతొలుత వ్రాయబడిన కావ్యం ఇదే అని చెప్పుకోవచ్చు...అందులోను, స్వతంత్రంగా కథానిర్మాణంచేసి, కథాంశాలని తానే సమకూర్చుకుని చేయబడిన మొదటిగ్రంథం ఆంధ్ర సారస్వతంలో ఇదే!

ప్రధానమైంది ఇంకో విషయముంది....కవులందరికి తలా ఒక శైలి ఉంటుంది. పురాణకవుల శైలులు పురాణకవులవి. కావ్యకవుల శైలులు కావ్యకవులవి. ఆ రెండిటికి చాలా భేదముంటుంది...పురాణకవులు ప్రధానంగా కథ చెప్పుకుపోవటం మీద దృష్టి పెడతారు. కావ్యకవుల దృష్టి ప్రధానంగా వర్ణన మీద ఉంటుంది...పురాణ కవులు పద్యరచన చక్కగా చెయ్యాలనే ప్రయత్నం ఎక్కువ చెయ్యరు. వారు రాసేప్పుడు దాని సందర్భాన్ని బట్టి ఒక మంచి రచనగల పద్యం రావచ్చు...కాని కావ్యకవుల్లో ఆ ప్రయత్నం అధికం.అలాంటి పద్యాల సంఖ్యా ఎక్కువే! పురాణాలు చదివేటప్పుడు పాఠకుడి బుధ్ధి కథాగమనం, భిన్నాంశాలు మొదలైన వాటిమీద ఉంటుంది....కాని కావ్యాలు చదివేప్పుడు అలా కాదు..ఇక్కడ పాఠకుడి బుద్ధి ప్రతి పద్యంలో ఉండే చమత్కారం, వాటిలో చెయ్యబడ్డ సూక్ష్మమైన కల్పన, రచనా సౌందర్యం వీటి మీద ఉంటుంది....వారిని వీరిని పోల్చిచూడకూడదు...

సామాన్య సంసారాలు ఉన్నై...సంపన్నమైనవీ ఉన్నై...రెండిటికీ ప్రాధాన్యం బ్రతకటమే...కాని సామాన్యుల ఇళ్ళల్లో అతిథులొస్తే చాపవేసి కూర్చోబెడతారు.మర్యాదచేసి మాటాడి పంపిస్తారు. అదే, గొప్ప సంపత్తుకల సంసారాలలో అతిథులు వస్తే పరుపులు, తివాసీలు, పట్టుతో కుట్టిన సోఫాలు, ఏసిలు, అగరొత్తులు- మొదలైన భోగాలుంటై...పురాణకవులకి, కావ్యకవులకి భేదం ఇది...

మరిన్నూ, తొలుతటి రాజులు వేఱు. తరువాత వచ్చిన రాజులు వేఱు. శ్రీకృష్ణరాయల నాటికి ఆంధ్రసామ్రాజ్యం ఏర్పడింది.విజయనగర సామ్రాజ్యం స్థిరపడింది. విజయనగరం, నాటి ప్రపంచకాలలో ఒక మహానగరం. అనంతమైన ఒక భోగభూమి. భోగాలలో సూక్ష్మమైన విషయాలని అనుభవించుటకు కావలసినంత సంపత్తు కలది. పాలు తాగితే వట్టి వెండిగిన్నెలో తాగరు. బంగారుగిన్నెకాని, వజ్రపుగిన్నె కాని కావాలి..ఆ గిన్నె చుట్టు, అది పట్టుకునే ’పిడి’ శిల్పాలతో, నగిషీ చెక్కబడి ఉండాలి...ఇదొక భోగలక్షణం... ఈ భోగలక్షణం ఆనాటి సర్వశిల్పవిద్యలందు భాసించింది...అదే కవిత్వంలోకి కూడా వచ్చింది...

అందువల్లనే పెద్దన్నగారి పద్యరచన, పరమ మాధుర్యగుణాలన్నిటికీ విధానమైంది...క్రొత్త క్రొత్త పలుకుబళ్ళకు,రమ్యమైన సమాసాలకు కాణాచిగా నిలబడింది..పరమేశ్వరుడు పరమ మధుర సరస్వతీరూపంగా, చిక్కటి శారదారూపంగా పెద్దన్నగారి వాక్కులో వచ్చికూర్చున్నాడు...ఆయనలాగా చక్కని మధురమైన పద్యరచన చెయ్యగల కవి ఆంధ్రసారస్వతంలో మరొకడుండడు..మన సారస్వతంలో ఉన్న మహాకవులందరి విషయంలో వారివారి శైలి, వారివారి ప్రత్యేకత అని చెప్పొచ్చు.కాని పెద్దన్నగారి విషయంలో ఈ ప్రత్యేకతలో కూడా ఒక వైలక్షణ్యం ఉంది....ఆ విజయనగర సామ్రాజ్య సూక్ష్మభోగ పరమ మాధుర్య లక్షణం ఆ శైలిలో ఉంది. ఇది అనుభవైక వేద్యం......

శ్రీనాథుడు దీనికి మార్గదర్శిగా కనిపిస్తాడు..కాని ఈ లక్షణం ఆయనలో పరాకాష్ట పొందలేదు...పెద్దన్నగారియందు పొందింది. అందుచేత ఆయన "ఆంధ్ర కవితా పితామహుడు. పితామహుడంటే ’తాత’ కాదు, "బ్ర్రహ్మ"...బ్రహ్మకి పూర్వం సృష్టి లేదా? బ్రహ్మనెవరు సృష్టించారు? ఈ కనపడే సృష్టిని బ్రహ్మ చేశాడు....ఈ రీతిగా ఆయన ఆంధ్రభాషలో ప్రథమ ప్రబంధ నిర్మాత. అంటే ప్రబంధ సర్వలక్షణాలు కలిగిన గ్రంథనిర్మాత అని అర్థం..

ఆంధ్ర సారస్వతానికి అదొక కొత్త భోగము..ఆ భోగమును ఆరంభించింది ఆయన...................

15, ఆగస్టు 2010, ఆదివారం

అల్లసాని వారి "అల్లరి" వినాయకుడు



ఉ. అంకముఁజేరి శైలతనయా స్తన దుగ్ధములానువేళ బా
ల్యాంక విచేష్టఁ దొండమున నవ్వలి చన్గబళింపఁబోయి యా
వంక కుచంబుఁ గాన కహివల్లభహారముఁ గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడు గజాస్యునిఁ గొల్తు నభీష్టసిద్ధికై.
(మను చరిత్రము-ప్ర.ఆ -౪)


మనుచరిత్ర, నేను చదివిన రెండో కావ్యం......మన తెలుగు ప్రబంధాలన్నీ కథారూపంగా చదుకున్నా, మొత్తం కావ్యంగా చదివింది రెండే రెండు.....మొదటిది కళాపూర్ణోదయం, రెండవది మనుచరిత్ర.......కళాపూర్ణోదయం చదవడం మాకు వారసత్వంగా వచ్చిన ఒక అలవాటులాంటిది అనుకోవచ్చు....మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ దగ్గర్నుంచో మరి అంతకుముందునుంచో మరి నాకు సరిగ్గా తెలియదు....మా అమ్మమ్మ కళాపూర్ణోదయం పేర్లన్నీ మా అమ్మవాళ్ళకి పెట్టేసింది...(అమ్మ పేరు సుగాత్రి, ఒక పిన్నిపేరు మధురలాలస, ఇంకో పిన్నిపేరు కలభాషిణి)......నాన్న అంటూ ఉంటారు.."అసలు, పేర్లు చూసే అనుకున్నా,మంచి సాహిత్య పరిచయం ఉన్న కుటుంబం అని....ఇంకో మాటలేకుండా పెళ్ళికి ఒప్పేసుకున్నా" అని.........నాకు కళాపూర్ణోదయం కథంటే చిన్నప్పట్నుంచీ ఎంత ఇష్టమో.....

ఇక మనుచరిత్ర విషయానికొస్తే.... నాకు కావ్యం చదవకముందు ఒఠ్ఠి కథ చదుకునేప్పుడు "ఎందుకు పెద్దన్న గారు, కథేమీలేకపోయినా కేవలం వరూథినీ ప్రవరాఖ్యం కోసం ఎందుకు మూడాశ్వాసాలు వృథా చేశాడా" అనిపించేది....నాకు మట్టుక్కు నాకు ఇప్పటికీ స్వరోచి కథే ఇష్టం....చక్కగా ఎంతమంది చుక్కల్లాంటి అమ్మాయిల్ని పెళ్ళి చేసుకుంటాడో! కట్నంగా ఎన్ని "విద్యలు" తెచ్చుకుంటాడో! తర్వాత.... పదోతరగతి పుస్తకంలో "ఇందీవరాక్షుని వృత్తాంతం" ఉండేది....ఏడో తరగతిలో ఉన్నప్పుడు అక్క దగ్గర ఆ పుస్తకం తీసుకుని చదుకున్నా....(మనకి ముందు తరగతి పుస్తకాలు ముందు ముందే చదవడం కూడా జన్యురీత్యా వచ్చిన లక్షణమే!).....అసలే పద్యాలంటే బహు ఇష్టమాయే!..అందులో ఉన్న ఆ పద్యాల అందానికి,తియ్యదనానికి ఇక ఆపబట్టలేక మనుచరిత్ర తీసి పద్యం,పద్యం చదుకోడం మొదలెట్టా.....అర్థం కాకపోతే నాన్నని అడగడం,నిఘంటువుల్లో వెతుక్కోడం....అలా ఎట్టకేలకు ఒక సంవత్సరానికి ముగించా......తర్వాత గురువుగారి వ్యాఖ్యానాలు....అప్పుడర్థమైంది!! అసలు మనుచరిత్రంతా మొదటి మూడాశ్వాసాలే అని........కానీ ఇప్పుడు ఒక్క పద్యం కూడా,కనీసం లేశమాత్రంకూడా గుర్తులేవు......ఆ తియ్యటి పద్యాల్ని మళ్ళా గుర్తుచేసుకుంటూ, పనిలో పనిగా మీతో పంచుకుందామనే ఈ ప్రయత్నం.......

ఇక మన పద్యంలోకొస్తే....

అంకము జేరి--- తొడనెక్కి.....తల్లి తీసి తొడమీద ఎక్కించుకోలేదు.....ఈయనే ఎక్కినాడు....ఎందుకోసమట అంత ఆరాటం?

శైలతనయా స్తన దుగ్ధములు------ తల్లియైన పార్వతి చనుబాలకోసమట! పాపం ఎంత ఆకలిమీదున్నాడో! అసలా తల్లి ఎవరు....కొండకూతురు....ఆమెయందు స్తన్యసమృద్ధి ఎంతయుండునో తెలియదు.....

బాల్యాంక విచేష్టన్----- బాల్యానికి చిహ్నమైన విశేషమైన చేష్టతో; ఆయన ఉంది శైశవంలో కాదట! బాల్యంలో.....అంటే ’మకురుపాలు’ తాగుతున్నాడు కాబోలు! ఆ తల్లి ఇంకా పాలు మాన్పించలేదన్నమాట!....మనిళ్ళల్లో ఐతే ఆర్నెల్లు నిండగానే మాయచేసో, అదిలించో మాన్పిస్తారు...... ఈయనకేం! పోటీ లేదుగా....వెనకాయనకి అఱువు తల్లులు ఆరుగురున్నారాయె!

తొండమున అవ్వలిచన్గబళింపబోయి---- పిల్లలు సాధారణంగా పాలుతాగుతూ విడిగాఉన్న చేత్తో తల్లి రెండవ ఱొమ్మును స్పృశిస్తుంటారు..పుణుకుతుంటారు....ఈ చేష్ట సరియే! కాని ఈ విఘ్నేశ్వరుడు తల్లి యొక్క అవ్వలి చన్ను తొండంతో గ్రహించబోతున్నాడు.ఎందుకు?తనకు చెయ్యుంది కదా! ఇది అసలు బాల్యాంక విచేష్టకాదు......ఏనుగు మొగము ఉన్నవాని లక్షణము......

అవ్వలి చన్+కబళింపబోయి----- కబళించుట అనగా తినుట....కబళము - ముద్ద; (మాధవ కబళమని వింటూంటాం కదా!)....మరి చన్నును కబళింపబోవుట ఏమిటి?---సరే!

ఆవంక కుచంబు గానక---- వెదకినాడు...ఆతలనున్న చన్ను కనపడలేదట! మరి ఏం కనపడిందో!

అహివల్లభ హారము గాంచి----- హారముగానున్న పాము కనిపించింది. అహివల్లభుడే హారమట! ఇక్కడ పాము హారంగా ఎక్కణ్ణుంచొచ్చింది? అమ్మ ఎప్పుడూ పాములు మెళ్ళో వేసుకోదే! వేసుకునేదెవరు? ఆ అయ్య పరమేశ్వరుడు......అదన్నమాట సంగతి.....ఈ అమ్మ, ఆ అయ్యతో సగం మేనుగా కలిసి అర్థనారీశ్వరరూపంతో ఉన్నారన్నమాట!.....సరే ఆ పాముని చూచినాడు.చూచినాడనగా తెలుసుకున్నాడని అర్థం.....ఇక్కడ కాంచి అనకూడదు....ఎందుచేత?

మృణాళాంకుర శంకనంటెడి------ మృణాళాంకురమనగా తామరతూటి మొక్క; ఆయన అది ’అహివల్లభహారము’గా తెలుసుకోలేదట! అక్కడ అహివల్లభహారము ఉండటం చేత అది మృణాళాంకుర మనుకొన్నాడు.....అమ్మ మంచి తామరపూల హారం వేసుకుందనుకున్నాడో ఏమో! పైగా తామరతూండ్లంటే ఏనుగులకి బహు ప్రీతికరమైన వస్తువాయే! అసలిక్కడ అహివల్లభుడంటే వాసుకి.....వాసుకి సర్పాలకి రాజు....శివునికి భూషణం....ఆ వాసుకి శరీరము మహాదీర్ఘమై,మహాస్థూలమై ఉండి ఉండాలి! మరి అతనిని మృణాళాంకురం అనుకోవటం ఎల్లా?

గజాస్యుని------ ఇది అర్థనారీశ్వర మూర్తి వర్ణన....ఈతడు గజాస్యుడు...అంటే ఏనుగు మొగము కలవాడు...

కొల్తున్+అభీష్ట సిద్ధికై----- అభీష్ట సిద్ధికి ఇలాంటి గజాననుని కొలుస్తానంటున్నాడు మన పెద్దన్నగారు......అసలు ఇక్కడ అభీష్టసిద్దికై ఇతనిని కొలవటానికి అతనియందు అభీష్టాలు సమకూర్చే లక్షణాలు లేవు...అలాంటి లక్షణాలు ఇక్కడ వర్ణితం కాలేదు...

వ్యుత్పత్తిచేత ’గజ’ శబ్దానికి అర్థం "మదము కలది" అని...అనగా యదార్థ పరిశీలన చేయనిది. అది లోకం యొక్క స్వభావము...ఈ లోకమే విఘ్నేశ్వరుని ముఖము. ఈ లోకము వట్టి భ్రాంతిమయం....తెలిసికూడ వట్టి భ్రాంతి....చనిపోతామని ఎవరికి తెలియదు? లోకం యొక్క ప్రవర్తనకి ఈ తెలియటానికి ఏం సంబంధం? ఇది భ్రాంతి......

అర్థనారీశ్వరుడనగా ఈ లోకంయొక్క మహాతత్త్వము పుంజీభూతమై దేవతారూపము కట్టినవాడు.....పార్వతి, దుర్గ..ఆమే ప్రకృతి...పంచభూతముల సమాహారం....పరమేశ్వరుడు ఈ పంచభూతాలయందు అభివ్యాప్తమైయున్న చైతన్యము...ముఖ్య ప్రాణము...విజ్ఞానమయ బ్రహ్మము మొదలైనవి కావచ్చును....అట్టి వారికి ముఖము మదముతో నిండిన కొడుకు పుట్టినాడు......మదమును మినహాయించినచో వీడు పరమ చైతన్య స్వరూపం....అతనిని కూడ మనము దేవతగా కల్పించి,(మన మదము మనకు తగ్గకూడదు.మన పనులు మాత్రం మనకి చక్కగా జరిగిపోవాలి) అట్టి విఘ్నేశ్వరుని స్తోత్రం చేస్తున్నాము............

దీనిని బట్టి ఇక్కడ మనమేం అర్థం చేసుకోవాలంటే...... కావ్యకవులు సామాన్యంగా వేదాంతార్థాలని ఉద్దేశించి వ్రాయరు....వారికి కావలసింది వాక్చమకృతి, పాఠకుని మనస్సుకు చక్కిలిగింతలు పెట్టటం, లోకంలో ఉండే లీలలు చిత్రించటం...మనం మరీ లోపలకి వెళ్ళి చూడకూడదు......

అసలు ఈ కావ్యకవుల ఊహలో కవిత అంటే, చల్లని గాలికి తగిలినట్టు....వెన్నెల్లో విహరించినట్టు..... మాంఛి పచ్చకప్పురపు పొడి చల్లుకున్నట్టు...కమ్మటి జుంటి తేనె జుఱ్రుకున్నట్టు.....అంతే!