ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

28, ఫిబ్రవరి 2010, ఆదివారం

భారతీ విద్యాపరిపూర్ణుడు శుకమహర్షి

సముఁడై యెవ్వఁడు ముక్తకర్మ చయుఁడై సన్న్యాసియై యొంటి బో

వ మహాభీతి నొహోకుమార యనుచున్ వ్యాసుండు సీరంగ వృ

క్షములుం దన్మయతం బ్రతిధ్వనులు సక్కంజేసె మున్నట్టి భూ

తమయున్ మ్రొక్కెద బాదరాయణిఁ దపోధన్యాగ్రణిన్ ధీమణిన్.
(భాగ - ప్ర - ౫౩)



ఆ శౌనకాది మహామునులు సూతమాహామునితో,ఇంకా ఇలా అంటున్నారు...."ఓ మునిశ్రేష్ఠా! కలియుగం సమీపిస్తోందని తెలిసి, ఆ కలిదోషహరణమైన శ్రీహరి కథలు వినాలని మా మనస్సుల్లో కలిగింది.అందుకే, మేమీ వైష్ణవక్షేత్రమైన నైమిశారణ్యంలో ఈ దీర్ఘమైన సత్రయాగాన్ని తలపెట్టాం.....దైవవశాత్తూ, సకల పురాణవ్రాతుడవైన నువ్వు మాకు కనిపించావు...ఆ గోవింద కథాసుధల్ని మాకు వినిపించి మమ్మల్ని ధన్యుల్ని చెయ్యి స్వామీ!....".

అప్పుడు, ఆ రోమహర్షణుని పుత్రుడు, ఉగ్రశ్రవసుడనే పేర ప్రసిద్ధ్హుడై, సకల పురాణ వ్యాఖ్యాన వైఖరులన్నీ పుక్కిట బట్టిన ఆ సూతమహాముని, ఆ శుకబ్రహ్మని స్మరించి, వర్ణిస్తూ అన్నదీ పద్యం.....సర్వ వేదాంతాలకీ నిలయం ఈ పద్యం........

వ్యాసుడు భారతీవంశవివర్థనుడు.....ఈ మాట రాసినవారు తిక్కన్నగారొక్కరే! (మహాభారతంలో,భీష్మపర్వంలో సంజయుడు ధృతరాష్ట్ర్రుడికి భారతయుద్ధ్హం చెప్పబోతూ,వ్యాస మహర్షిని స్తోత్రం చేస్తూ,"ప్రాంశుఁబయోద నీలతనుభాసితు" అన్న పద్యం చెప్తాడు...అందులోది ఈ మాట.) ఇదొక ఆశ్చర్యమైన మాట.....భారతి అనగా సరస్వతి- ఆమె వంశాన్ని వృద్ధ్హిపొందించినవాడట! భారతి బ్రహ్మదేవుని భార్య.వారి సంతానం వసిష్ఠమహర్షి...ఆ సరస్వతీదేవి సర్వతేజస్సూ విద్యారూపంలో వసిష్ఠులవారికి సంక్రమించింది..ఆయన కుమారుడు శక్తి. శక్తి కుమారుడు పరాశరుడు. పరాశరుని కొడుకు వ్యాసుడు. అలా ఆ శారదాదేవి విజ్ఞానమంతా వ్యాసునికి పరంపరగా సంక్రమించింది.

ఆ విద్యని వ్యాసమహర్షి వృద్ధ్హిపొందించాడు.ఎలా?వేదాల్ని విభజించి,అష్టాదశ పురాణాలు విరచించి.... బ్రహ్మసూత్రాలు రాసి,భగవద్గీత రాసి....మహాభాగవతాన్ని మనకందించి.... ఆ భారతీవిద్యాసర్వస్వాన్ని, గ్రథనం చేసి వ్యాసమహర్షి వివర్థనం చేశాడు......ఆ వ్యాసుని కుమారుడైన శుకమహర్షియందు ఈ విద్య పండింది....ఆ శుకుడు భారతీ విద్యాపరిపూర్ణ స్వరూపుడు. అద్వైతమత పరమార్థమంతా మూర్తిదాల్చినవాడు....... ఉపనిషత్తుల అర్థమంతా బొమ్మకట్టినవాడు........తరువాత ఆ భారతీవిద్య మన శంకరాచార్యులవారితో భాష్యరూపం పొందింది......విద్యావివర్థునుడు మాత్రం వ్యాసమహర్షి.........భారతి - వసిష్ఠుడు - శక్తి - పరాశరుడు - వ్యాసుడు - శుకుడు - గౌడపాదాచార్యులవారు - గోవింద భగవత్పాదాచార్యుల వారు - శ్రీ శంకర భగవత్పాదులు - ఇదీ భారతీ వంశము..............

ఇక మన పద్యంలోకొస్తే........

సముఁడై------సమానుడై...సర్వభూతాలతో ఒక్కటైన వాడై.......అన్ని జీవరాసులందు ఆ మహా మహర్షి ఒక్కటిగానే వర్తిస్తున్నాడు.....

ముక్తకర్మ చయుఁడై------కర్మ సమూహాన్నంతటినీ వదిలిపెట్టినవాడై; విద్యకి, అవిద్యకి ఒక్కటే భేదం...... ఈ కర్మసంఘాత వాసన-అవిద్య........ఆ వాసన లవలేశం కూడా లేకపోవటమే విద్య........ వాసన ఉన్నవాడు - సంసారి....అది వదిలినవాడు - ముక్తుడు.......ఇది నిష్కృష్టమైన అర్థం. శుకమహర్షి అటువంటి ముక్తిని పొందినవాడు.....కాదుకాదు,పొందినవాడన్న మాట వ్యావహారికం....ఆయన అదే అయినవాడు....

సన్న్యాసియై------ సన్న్యాసము కలవాడై; ఆయన పుట్టుసన్న్యాసి.....కాదుకాదు, అసలాయనకి సన్న్యాసమే లేదు....లోకానికి సన్న్యాసిలాగా కనిపిస్తాడు......భాగవతంలో తరువాత ఒక సన్నివేశం వస్తుంది.......ఒకసారి దేవకన్యలు స్నానం చేస్తుంటారు..శుకమహర్షి పక్కగా వెళ్తుంటాడు, ఆయన వంటిమీద గోచీకూడా లేదట....కానీ ఆ అప్సరసలు గమనించీ పట్టించుకోరు, వాళ్ళ జలక్రీడల్లో మునిగిపోతారు......వెంట, శుకుణ్ణి పిలుస్తూ వ్యాసుడు వస్తుంటాడు....ఆయన్ని చూడగానే, ఆ దేవకన్యలు సిగ్గుపడి, గబగబా తమ చీరలు కప్పుకుని తప్పుకుంటారు......అదిచూసి, వ్యాసుడు ఆ దేవకన్యల్ని" నా కొడుకు యవ్వనంలో ఉన్నాడు,పైగా నగ్నంగా ఉన్నాడు...అయినా ఆయన్ను చూసి మీరు సిగ్గుపడలేదు....కానీ నేను వస్త్రధారిని, పైగా వృద్ధ్హుణ్ణి. నన్ను చూసి సిగ్గుపడి మీరు చీరలు కప్పుకున్నారు. కారణమేంటి" అని అడుగుతాడు.....దానికి వాళ్ళు," ఓ వ్యాసమునీంద్రా! నీ కొడుక్కి ఈమె స్త్రీ, వీడు పురుషుడు అన్న భేదదృష్టి ఉండదు...ఆయన నిర్వికల్పుడు...కనుక ఆయనకి నీకు చాలా అంతరం ఉంది." అన్నార్ట........అలాంటి వాడు శుకుడు....

ఒంటి బోవన్------ఒక్కడే పోతుంటే; "ఏకమేవా ద్వితీయం బ్రహ్మ" అన్న ఉపనిషదుక్తికి అర్థంగా ఉన్నాడట.....తానే బ్ర్హహ్మపదార్థం అన్న స్థితిని పొందినవాడని అర్థం....

అలా పోతున్న కుమారుణ్ణి వ్యాసుడు చూసి,
మహాభీతిన్------- మహాభయంతో; భయము అంటే సంసారంలో నిమగ్నమైపోయి వేరేది పట్టకపోవడం........భయమంటే వేరే ఒకటి ఏదో కాదు, అజ్ఞానమే!!!!

ఒహో కుమార! అనుచున్ వ్యాసుండు సీరంగ-----ఓ కుమారా అంటూ వ్యాసుడు పిలుస్తూ వెళుతుంటే....

వృక్షములుం దన్మయతం ప్రతిధ్వనులు సక్కంజేసె మున్ను------- చుట్టూ ఉన్న చెట్లన్నీ కూడా తన్మయత్వంతో ప్రతిధ్వనులు చేస్తున్నాయట!

అట్టి భూతమయున్------ ఈ రీతిగా శ్రీ శుకమహర్షి పంచభూతాల్లో లీనమయ్యాడు.......అసలు పంచభూతాలకి,ఆయనకి భేదమే లేకపోయింది.......

బాదరాయణిఁ దపోధన్యాగ్రణిన్ ధీమణిన్------ మహా తపశ్శక్తి సంపన్నుడై, సర్వ మునులకీ కిరీటమణి వంటివాడైన ఆ బాదరాయణికి, ఆ శుకమహర్షికి.......

మ్రొక్కెద--------- శిరసువంచి మనసారా నమస్కరిస్తున్నాను..........

ఇది అద్వైతంలోని పరమరహస్యాలన్నీ చెప్తున్న పద్యం.......ఈ పద్యంలోని రహస్యాలన్నీ ఉపనిషత్తుల్లో ఉన్నై....అసలు ఈ ఒక్క పద్యానికి ఉపనిషత్తులన్నీ వ్యాఖ్యానాలనాలి!!!!!!

22, ఫిబ్రవరి 2010, సోమవారం

అంత్యానుప్రాస చక్రవర్తి మన పోతన్నగారు


భూషణములు వాణికి నఘ
పేషణములు మృత్యు చిత్త భీషణములు హృ
త్తోషణములు గల్యాణ వి
శేషణములు హరి గుణోపచిత భాషణముల్.
(భాగ - ప్ర - ౪౪)



మన పోతన్నగారు ముందు ఉపోద్ఘాతం పద్యాలయ్యాక, తన వంశ వర్ణనం చెప్తారు......తరువాత తన వేలుపుతండ్రి శ్రీ రామనారాయణునికి భాగవతాన్ని సమర్పిస్తున్నానంటూ, షష్ఠ్యంతాలు చెప్తారు......"హారికి నందగోకుల విహారికి","శీలికి నీతిశాలికి వశీకృతశూలికి","క్షంతకు కాళీయోరగ విశాల ఫణోపరినర్తన క్రియారంతకు","న్యాయికి భూసురేంద్రమృతనందనదాయికి రుక్మిణీ మనస్స్థాయికి".......అంటూ చెప్తారు... అబ్బబ్బ.....ఏం పద్యాలు!..ఒక్కోటీ అంత్యానుప్రాసల అమృతగుళికలు.....తియ్యటి చక్కెర చిలకలు....

తర్వాత అద్భ్హుతమైన నైమిశారణ్య వర్ణన.........ఆ శ్రీవిష్ణుక్షేత్రమైన నైమిశంలో శౌనకాది మహామునులు హరిని చేరుకోవటానికి సత్రయాగం చేస్తున్నారట...ఆ యాగం సహస్రవర్షాలు అనుష్ఠానకాలం కలదట.....ఒకరోజు నిత్యహోమాదులైన తర్వాత మునులందరూ, సకల పురాణవ్రాతుడైన సూతమహాముని దగ్గరికొచ్చి మాకేవైనా నాలుగు మంచిమాటలు చెప్పమని అడిగార్ట......

అవికూడా ఎల్లాంటి మాటలయ్యా అంటే.......

భూషణములు వాణికిన్----సరస్వతికి నగలవ్వాలట,గొప్ప అలంకారాలుగా ఉండాలట....

అఘపేషణములు-------పాపాల్ని పిండిపిండి చేసెయ్యాలట!

మృత్యు చిత్త భీషణములు-----మృత్యువు యొక్క చిత్తానికి భయంగొలిపేవట, అంటే మనమా మాటలంటూంటే, మృత్యువు భయపడి పారిపోవాలట....దాని ఆలోచనా రూపాలైన రోగాలుకూడా దరిచేరకూడదట!

హృత్తోషణములు-------హృదయాన్ని సంతోషపెట్టునవి అంటే, మన మనసుని ఆనందపు జల్లుల్లో తడపాలన్నమాట!

కళ్యాణ విశేషణములు----శుభాలని విశేషంగా కల్పించేవట......

మరి ఇంతటి మహత్తు వేటికుందో కదా............
హరి గుణోపచిత భాషణముల్------అదీ! ఆ హరి, ఆ శ్రీమహావిష్ణువు గుణగణాలు కూర్చిన మాటలన్నమాట! (ఉపచిత-సమకూర్చబడిన)

మన పోతన్నగారి భాగవతంలో ఇలాంటి పద్యాలు చాలా ఉంటై....వీటిలో అంత్యప్రాసలు,యమకాలు సమకూర్చి ఉంటాయ్....ఒక మాటతో కందపద్యం మొదలు పెట్టటం, అలాంటి మాటలతోనే పద్యమంతా పూర్తచెయ్యటం...ఈరకమైన కందాన్ని వారే ప్రారంభించారు...వారే సమర్థించారు..వారే అక్కడ చక్రవర్తిగా ఏలారు....వట్టి చక్రవర్తి కాదు, ఏకఛ్ఛత్రాధిపత్యం వహించారు.......

ఇంకొకడు ఇలాంటి పద్యాలు వ్రాయలేడు...వ్రాసినా అంత అందంగా ఉండవు......ఇతర కవుల కొన్ని పద్యాల్ని అనుకరించవచ్చు.అనుకరిస్తే అనుకరించాడని తెలుస్తుంది......అనుకరణలో ఒక చమత్కారం ఉంది, అనుకరింపబడ్డవాడి లక్షణం కనిపిస్తూ ఉంటుంది. మళ్ళా అనుకరించినవాడి లక్షణంకూడా కొంత కనిపిస్తూనే ఉంటుంది........కాని పోతన్నగారి ఇల్లాంటి పద్యాల్ని అనుకరిస్తే మనకు వాడు అనుకరించాడనే తెలియదు. పోతన్నగారి శక్తిలో వాడు మునిగిపోతాడు.అక్కడ వాడికి నామరూపాలుండవు.... పోతన్నగారే మనకి గోచరిస్తారు; పోతన్నగారి యిట్టి కందపద్యరచన అట్టిది.......ఆ పద్యం సర్వమూ పోతన్నగారి మయము..........

10, ఫిబ్రవరి 2010, బుధవారం

భాగవత కల్పవృక్షం


















లలితస్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామమ్ము మం
జులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరో
జ్వలవృత్తంబు మహాఫలంబు విమలవ్యాసాలవాలంబునై
వెలయన్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్ద్విజ శ్రేయమై.
(భాగ - ప్ర - ౨౦)





నా చిన్నప్పుడు,నాన్న క్షీరసాగరమథనం కథ చాలా అందంగా చెప్పేవారు....అందులో ఒక్కో వస్తువూ మెల్లగా రావడం మొదలెడతాయ్.....మొదట హాలాహలం వస్తుంది....దాన్ని మన శివయ్య తాగేస్తాడు....బైటే కాదు,శివుయ్య పొట్టలో కూడా మనలాంటి లోకాలుంటాయంట! అందుకని మన పార్వతీదేవి,శివుడి గొంతు గట్టిగా పట్టుకుని ఆ విషాన్ని అక్కడే ఆపేసిందట! అంతే మరి! నాన్నలకి మన మీద ప్రేమున్నా తొందరెక్కువ.....’అమ్మ’నే అన్నీ ఆలోచించి చేస్తుంది......సరే అది అయిపోయిందిగా! తర్వాత కల్పవృక్షం వచ్చిందట! అప్పుడు నేనున్నాగా అనుమానాల పుట్టని.....అడిగా..."నాన్నా!కల్పవృక్షమంటే ఏంటీ?" అని......"మన కోర్కెలన్నీ తీర్చేది" అని చెప్పాడు నాన్న......మనం ఒక్క అనుమానంతో ఆగం కదా! మళ్ళా అడిగా..."నాన్నా! మరి ఆ కల్పవృక్షం ఎలా ఉంటుంది? మన చెఱువొడ్డున జువ్విచెట్టుందే, అల్లా పెద్దగా ఉంటుందా!" అని.......అప్పుడు నాన్న నవ్వి ఈ పద్యం చెప్పి ,"కల్పవృక్షమంటే, మన భాగవతంలాంటిదన్నమాట!" అనేవారు....నేనేమో ఈ పద్యంలోలా కల్పవృక్షాన్ని,మన భాగవతంతో పోల్చుకుని తెగ ఊహించేసుకునేవాణ్ణి.........

ఇక మన పద్యంలోకొస్తే......

మన పోతన్నగారు భాగవత పురాణం యొక్క గొప్పదనాన్నంతా ఈ పద్యంలో చెప్తారు....భాగవతము కల్పవృక్షమల్లే చెప్పబడింది.......అంటే, వృక్షానికి ఉన్న లక్షణాలు, భాగవతానికి ఉన్న లక్షణాలు సరిపోల్చబడ్డాయన్నమాట......

భాగవతాఖ్య కల్పతరువు---- భాగవతపురాణమనే ఈ కల్పవృక్షం

ఉర్విన్----ఆ కల్పతరువు దేవలోకంలో ఉంటే, ఈ భాగవత కల్పవృక్షం మన భూలోకంలో వెలిసిందట, ఎందుకూ...

సద్ద్విజ శ్రేయమై---- మానవుల శ్రేయస్సుకోసమట...

వెలయన్-----ఆ భాగవతం ఎలా ఉందయ్యా అంటే...

లలితస్కంధము------- స్కంధము అంటే చెట్టుబోద; అంటే కల్పవృక్షం బోద అంత లలితంగా ఉందట!(మరీ అల్లా ఉంటే ఎల్లా! గట్టిగా గాలొస్తే పడిపోదూ! కాదులే,దేవతావృక్షం కదూ...ఏం అవదు)......మన భాగవతంలో కూడా పన్నెండు స్కంధాలున్నాయిగా! ఒక్కో స్కంధమూ మందార మకరందమూ,లలిత రసాల పల్లవమూ కదా! (భలే!మన భాగవతం పన్నెండు కల్పవృక్షాలతో సమానమన్నమాట!).

’కృష్ణ’మూలము-------- అంటే నల్లనివేళ్ళు కలది!(చాలా గట్టివేళ్ళన్నమాట!ఇంకెలా పడిపోతుందీ!).......భాగవతం కృష్ణుడు మూలమైన కథ కదా!

శుకాలాపాభిరామమ్ము----------శుకము అనగా చిలుక; ఆలాపము-మాట; అభిరామము-మనోహరము; అంటే, కల్పవృక్షం చిలకల కిల కిలలతో, మనోహరంగా ఉందట......మన భాగవతమంతా భారతీవిద్యాపరిపూర్ణుడైన శుకమహర్షి, పరీక్షిన్మ్గహారాజుకు ’సముడై’ సర్వోపనిషదర్థరూపంగా బోధించిన కథే కదా!

మంజులతా శోభితము-------- మంజు-మనోహరమైన; లతా-తీగల చేత; అందమైన తీగలు పాకి కల్పవృక్షం మహా మనోహరంగా ఉన్నదట!
మంజులతా----మనోహరత్వము చేత శోభితమైనది మన భాగవతం; భగవంతుని కథలు మనోహరములు కనుక......

సువర్ణ సుమనస్సుజ్ఞేయము------- సువర్ణ-బంగారు; సుమనః-పువ్వుల చేత; లేదా దేవతల చేత; సుజ్ఞేయము-చక్కగా తెలిసికొన దగినది.....అంటే, కల్పవృక్షానికి బంగారు వన్నెగల పువ్వులుంటాయన్నమాట! దాని కింద పసిడికాంతుల దేహాలతో దేవతలుంటారన్నమాట!
సువర్ణ--మంచి అక్షరాలు అనగా మంచి మాటలు; సుమనః--మంచి మనసు; సుజ్ఞేయము--తెలిసికొనదగినది.మన భాగవతం నిండుగా అన్నీ మంచి మాటలే,,,,మంచి మనసుతో అవన్నీ నేర్చుకోవలసిందే...

సుందరోజ్వల వృత్తంబు------- అందమైన ప్రకాశించుచున్న వృత్తము కలది......కల్పవృక్షం గొగ్గిరి,గొగ్గిరిగా కాకుండా చక్కగా గుండ్రంగా,నున్నగా ప్రకాశిస్తోందట......మన భాగవతం నిండా కూడా ఉత్పలమాల,చంపకమాల,శార్దూలం,మత్తేభం మొదలైన ఎన్నో అందమైన వృత్తాలతో పద్యాలున్నాయిగా! అవి ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటాయి..

విమల వ్యాసాలవాలంబు------ అలా ఆ కల్పవృక్షం ప్రతి భాగమూ చాలా అందంగా ఉన్నదట! మన భాగవతాన్ని మొదట వ్యాసమహర్షి ఎంతో అందంగా చెప్పాడు కదా!

మహా ఫలంబు--------- కల్పవృక్షం అన్ని కోరికలూ తీరుస్తుంది.....భాగవతం కూడా చదివినవారికీ,విన్నవారికీ సర్వవాంఛలనూ సమకూరుస్తుంది......

”సర్వేజనాస్సుఖినోభవంతు”

4, ఫిబ్రవరి 2010, గురువారం

కలుగనేటికి తల్లుల కడుపుచేటు


చేతులారంగ శివుని పూజింపఁడేని

నోరునొవ్వంగ హరికీర్తి నుడువఁడేని

దయయు సత్యంబులోనుఁగాఁ దలపఁడేనిఁ

గలుగనేటికిఁ దల్లుల కడుపుచేటు.
(భాగ - ప్ర - ౧౨)


నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన పద్యం ఇది. ఇలాంటి పద్యాలు మన వాళ్ళకు చిన్నతనంలోనే నేర్పితే,ఆ భావాలు వాళ్ళ మనస్సుల్లో బలంగా నాటుకుపోతాయి...మన సంస్కృతి బీజాలు వాళ్ళ మనసుల్లో మొలకెత్తి, పెరిగి, శాఖోపశాఖలుగా విస్తరిస్తాయి.....మహావృక్షాలుగా కలకాలం నిలిచి ఉంటాయి...

చేతులారంగ శివుని పూజింపడేఁని నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేఁని---- నాన్న ఈ పద్యం చెప్పేప్పుడు చాలామందిలానే నాకూ ఓ అనుమానం వచ్చేది.అడిగేవాణ్ణి."నాన్నా! అంటే, చేతులారా శివుణ్ణి పూజించాలి, నోరు నొప్పుట్టేట్లు హరినామసంకీర్తనం చెయ్యాలన్నమాట! అంతేగా! ఏం శివుణ్ణి కీర్తించి, విష్ణువుని పూజించకూడదా!". దానికి నాన్న "అలా ఏంకాదు...శివకేశవులిద్దరూ ఒకటే....అభేదప్రతిపత్తి....అసలు ఏ దేవుడికైనా ఇలానే చెయ్యాలి." అని చెప్పేవారు.....ఇక్కడ చేతులారా అంటే, వఠ్ఠి చేతులతో అని కాదు...మనసారా అని.....ఏ భావమైనా మనసు నిండుగా కలిగితేనే, ఆ పని చేతులు కూడా మెండుగా చేస్తాయి....(కాని కొంతమంది ఉంటారు,పక్కవాడు చూస్తున్నాడు కదా అని, మరీ బారలేసి చేస్తుంటారు...అలా కాకుండా,మనసారా పూజించమని మన పోతయ్య గారి భావం.).....
ఇక నోరునొవ్వంగ అంటే, మనం ఎక్కడ ఉన్నా,ఎంతమందిలో ఉన్నా ఎటువంటి అంతర్గతమైన అడ్డుగోడలు లేకుండా నామకీర్తనం చెయ్యాలి...చిన్నప్పుడు ఇంట్లో పూజలోనైనా, దేవాలయానికెళ్ళినా నాన్న ఏదో ఒక స్తోత్రమో,గోవిందనామమో పెద్దగా చదివేవాళ్ళు...నేను ఒకసారి,"నాన్నా!ఎందుకంత పెద్దగా చదువుతారు,చుట్టూ అందరూ మిమ్మల్నే చూస్తున్నారు!ఏమన్నా అనుకుంటారు, బాగుండదు."అన్నా...దానికి నాన్న ఈ పద్యం చెప్పి"ఎవరో ఏదో అనుకుంటారని చదవకపోతే, దేవుడు ఏమన్నా అనుకోడూ....పైగా, మనం పెద్దగా చదివితే ముందు వింతగా చూసినా, కాసేపటికి వాళ్ళల్లో కూడా భక్తిభావం పెరుగుతుంది."అన్నారు...అంతే నేను కూడా అన్ని అంతరాలూ వదిలేసి నాన్నతో గొంతు కలిపా..అంతే! వెంటనే మా చుట్టుపక్కలంతా కూడా "గోవింద"నామం మారుమోగింది...(ఒకసారి దుర్గగుళ్ళో,దసరాలప్పుడు క్యూ చాలా పెద్దగా ఉంది..నేను వరసగా నాకొచ్చిన స్తోత్రాలన్నీ గొంతంతా విప్పి, మైమరిచి చదువుకుంటున్నా..దర్శనం అయ్యి వచ్చేప్పుడు ఒకావిడ పిలిచి,"బాబూ!మేం ఎప్పుడు క్యూలో నుంచున్నా ఏదో ఒక సోది కబుర్లు చెప్పుకున్నేవాళ్ళం..కాని ఇవాళ,దర్శనం అయ్యేవరకు మనసు అసలు పక్క విషయాల మీదకు వెళ్ళలేదు" అంది.)....ఇంకా కొంతమంది అంటుంటారు..మనసులో అనుకుంటే చాలదా అని....అసలు ఆ అంతఃకరణ శుధ్ధ్హి కోసమే, ఈ నామ కీర్తనమూ, నవవిధభక్తిక్రమమూ....

దయయు సత్యంబులోనుఁగాఁ దలపఁడేఁనిఁ----దయ,సత్యం మనసు అంతరాల్లోంచి పుట్టుకురావాలి కానీ, పేరుప్రతిష్ఠల కోసం పైపై మెరుగులు మెరిపించకూడదు.....

కలుగ నేటికి తల్లుల కడుపుచేటు----అసలు ఈ పద్యం అర్థమంతా ఇందులోనే ఉంది....ఈ పద్యం నోటికి రానివాడు ఆంధ్రభారతీయుడు కాదు..దానంతటదే నోటికొస్తుంది.రాకుండా ఎలా ఉంటుంది?అది రాకుండా నువ్వు నీ నోటికొక తాళం వేసుకొంటే రాదేమో! ఎంత తాళం వేసుకున్నా తెరవొచ్చుకదా! కొన్ని తాళాలు సురక్షితంగా ఉంటయ్.అంటే వాటికి వేరే తాళంచెవి పట్టదు....ఎంత చిక్కుతాళమైనా గజదొంగలుంటారు..మనదేశంలో లేకపోయినా పాశ్ఛాత్యదేశాల్లో ఉంటారు.ఇప్పుడు మనవాళ్ళు కూడా వాళ్ళదగ్గర్నుండి అన్ని విద్యలూ సంపాదించుకున్నారు గనుక ఆ తాళంచెవులు కూడా సంపాదిస్తారేమో!

అసలు ఈ తాళాలు విలక్షణమైనవి.బయట చేసినవి కాదు.లోపల చేసినవే. అంటే వాడు నాస్తికుడై, ఇలాంటి పద్యాలు నేను చదవనని ప్రతిజ్ఞపూనటం..శివుడు,విష్ణువు భగవంతుని రూపాలు కాదనటం..అసలు భగవంతుడే లేడనటం.....తాళం వాడే చేశాడు, వాడే బిగించుకున్నాడు, చెవి వాడిదగ్గరే ఉంది...అల్లాంటి వారిని గురించి పోతన్నగారంటున్నారు,"కలుగనేటికి తల్లుల కడుపుచేటు"అని! ఆ మహానుభావుణ్ణి ఆ తల్లి తొమ్మిదినెలలు మోసింది....ప్రసూతిబాధ పడ్డది..వాడికి నానా చాకిరీ చేసింది..చివరకు వీడు సిద్ధ్హమైనాడు!!!

కాదయ్యా వీడు గొప్ప ఉద్యోగం చేశాడు,గొప్ప ప్రచారం చేశాడు,ఒక మంత్రి, ఒక కవి, ఒక కలెక్టరు, ఒక పత్రికాధిపతి, లోకాన్ని ఊగించి పడేశాడంటారేమో!నిజమే కావచ్చు.అనంతదేశాలలో,అనంతకాలంలో ఇలాంటి పనులు చేసినవాళ్ళు అంత సంఖ్య ఉన్నారు.ప్రయోజనమేముంది! చివరకు చనిపోయారు.అయితే శివపూజ చేసినవాడు,హరిభజన చేసినవాడు చావకుండా మిగిలారా అనేది ప్రశ్న? వాళ్ళూ పోయారు....చచ్చి ఉత్తమజన్మలు పొందారు....."అమ్మలగన్నయమ్మ" పద్యానికి రాసిన వ్యాఖ్యానం ఇక్కడ సంధించుకోవచ్చు,,,

ఈ పంచభూతాలు వేఱు, ఆ జీవుడు వేఱు...ఆ భక్తులు జీవలక్షణానికి సంబంధించినవారు. వీళ్ళు వట్టి మట్టిపదర్థానికి సంబంధించినవారు...అందువల్ల వీళ్ళు తల్లుల కడుపుచేటు. అంటే ఈ మట్టిలోకి(పంచభూతాత్మకమైన శరీరంలోకి) జీవుడు ప్రవేశించి సత్క్యార్యాలు చేస్తే మట్టికి చరితార్థం...ఆ మట్టిలో మళ్ళా మన్నే ప్రవేశిస్తే రెట్టింపు బరువు....తల్లుల కడుపుచేటంటే అర్థం ఇది...జీవుడు వెలుతురు,అగ్ని,ప్రకాశం. అది ప్రవేశించిన మట్టిపాత్ర తేలిపోతుంటుంది..అందులోనూ కొంత ఆకాశముంది.ఆ మట్టిపాత్ర తేలిక...కాని ఇలాంటి నాస్తిక జీవుడు ప్రవేశించిన పాత్ర, అసలది పాత్ర కాదు, వఠ్ఠి మట్టిముద్ద, లేకపోతే మన్నుతో నింపిన కుండ.........ఆ కుండ పదిరెట్లు బరువు...తల్లుల కడుపుచేటు కాదా!!!!