ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

28, ఫిబ్రవరి 2010, ఆదివారం

భారతీ విద్యాపరిపూర్ణుడు శుకమహర్షి

సముఁడై యెవ్వఁడు ముక్తకర్మ చయుఁడై సన్న్యాసియై యొంటి బో

వ మహాభీతి నొహోకుమార యనుచున్ వ్యాసుండు సీరంగ వృ

క్షములుం దన్మయతం బ్రతిధ్వనులు సక్కంజేసె మున్నట్టి భూ

తమయున్ మ్రొక్కెద బాదరాయణిఁ దపోధన్యాగ్రణిన్ ధీమణిన్.
(భాగ - ప్ర - ౫౩)



ఆ శౌనకాది మహామునులు సూతమాహామునితో,ఇంకా ఇలా అంటున్నారు...."ఓ మునిశ్రేష్ఠా! కలియుగం సమీపిస్తోందని తెలిసి, ఆ కలిదోషహరణమైన శ్రీహరి కథలు వినాలని మా మనస్సుల్లో కలిగింది.అందుకే, మేమీ వైష్ణవక్షేత్రమైన నైమిశారణ్యంలో ఈ దీర్ఘమైన సత్రయాగాన్ని తలపెట్టాం.....దైవవశాత్తూ, సకల పురాణవ్రాతుడవైన నువ్వు మాకు కనిపించావు...ఆ గోవింద కథాసుధల్ని మాకు వినిపించి మమ్మల్ని ధన్యుల్ని చెయ్యి స్వామీ!....".

అప్పుడు, ఆ రోమహర్షణుని పుత్రుడు, ఉగ్రశ్రవసుడనే పేర ప్రసిద్ధ్హుడై, సకల పురాణ వ్యాఖ్యాన వైఖరులన్నీ పుక్కిట బట్టిన ఆ సూతమహాముని, ఆ శుకబ్రహ్మని స్మరించి, వర్ణిస్తూ అన్నదీ పద్యం.....సర్వ వేదాంతాలకీ నిలయం ఈ పద్యం........

వ్యాసుడు భారతీవంశవివర్థనుడు.....ఈ మాట రాసినవారు తిక్కన్నగారొక్కరే! (మహాభారతంలో,భీష్మపర్వంలో సంజయుడు ధృతరాష్ట్ర్రుడికి భారతయుద్ధ్హం చెప్పబోతూ,వ్యాస మహర్షిని స్తోత్రం చేస్తూ,"ప్రాంశుఁబయోద నీలతనుభాసితు" అన్న పద్యం చెప్తాడు...అందులోది ఈ మాట.) ఇదొక ఆశ్చర్యమైన మాట.....భారతి అనగా సరస్వతి- ఆమె వంశాన్ని వృద్ధ్హిపొందించినవాడట! భారతి బ్రహ్మదేవుని భార్య.వారి సంతానం వసిష్ఠమహర్షి...ఆ సరస్వతీదేవి సర్వతేజస్సూ విద్యారూపంలో వసిష్ఠులవారికి సంక్రమించింది..ఆయన కుమారుడు శక్తి. శక్తి కుమారుడు పరాశరుడు. పరాశరుని కొడుకు వ్యాసుడు. అలా ఆ శారదాదేవి విజ్ఞానమంతా వ్యాసునికి పరంపరగా సంక్రమించింది.

ఆ విద్యని వ్యాసమహర్షి వృద్ధ్హిపొందించాడు.ఎలా?వేదాల్ని విభజించి,అష్టాదశ పురాణాలు విరచించి.... బ్రహ్మసూత్రాలు రాసి,భగవద్గీత రాసి....మహాభాగవతాన్ని మనకందించి.... ఆ భారతీవిద్యాసర్వస్వాన్ని, గ్రథనం చేసి వ్యాసమహర్షి వివర్థనం చేశాడు......ఆ వ్యాసుని కుమారుడైన శుకమహర్షియందు ఈ విద్య పండింది....ఆ శుకుడు భారతీ విద్యాపరిపూర్ణ స్వరూపుడు. అద్వైతమత పరమార్థమంతా మూర్తిదాల్చినవాడు....... ఉపనిషత్తుల అర్థమంతా బొమ్మకట్టినవాడు........తరువాత ఆ భారతీవిద్య మన శంకరాచార్యులవారితో భాష్యరూపం పొందింది......విద్యావివర్థునుడు మాత్రం వ్యాసమహర్షి.........భారతి - వసిష్ఠుడు - శక్తి - పరాశరుడు - వ్యాసుడు - శుకుడు - గౌడపాదాచార్యులవారు - గోవింద భగవత్పాదాచార్యుల వారు - శ్రీ శంకర భగవత్పాదులు - ఇదీ భారతీ వంశము..............

ఇక మన పద్యంలోకొస్తే........

సముఁడై------సమానుడై...సర్వభూతాలతో ఒక్కటైన వాడై.......అన్ని జీవరాసులందు ఆ మహా మహర్షి ఒక్కటిగానే వర్తిస్తున్నాడు.....

ముక్తకర్మ చయుఁడై------కర్మ సమూహాన్నంతటినీ వదిలిపెట్టినవాడై; విద్యకి, అవిద్యకి ఒక్కటే భేదం...... ఈ కర్మసంఘాత వాసన-అవిద్య........ఆ వాసన లవలేశం కూడా లేకపోవటమే విద్య........ వాసన ఉన్నవాడు - సంసారి....అది వదిలినవాడు - ముక్తుడు.......ఇది నిష్కృష్టమైన అర్థం. శుకమహర్షి అటువంటి ముక్తిని పొందినవాడు.....కాదుకాదు,పొందినవాడన్న మాట వ్యావహారికం....ఆయన అదే అయినవాడు....

సన్న్యాసియై------ సన్న్యాసము కలవాడై; ఆయన పుట్టుసన్న్యాసి.....కాదుకాదు, అసలాయనకి సన్న్యాసమే లేదు....లోకానికి సన్న్యాసిలాగా కనిపిస్తాడు......భాగవతంలో తరువాత ఒక సన్నివేశం వస్తుంది.......ఒకసారి దేవకన్యలు స్నానం చేస్తుంటారు..శుకమహర్షి పక్కగా వెళ్తుంటాడు, ఆయన వంటిమీద గోచీకూడా లేదట....కానీ ఆ అప్సరసలు గమనించీ పట్టించుకోరు, వాళ్ళ జలక్రీడల్లో మునిగిపోతారు......వెంట, శుకుణ్ణి పిలుస్తూ వ్యాసుడు వస్తుంటాడు....ఆయన్ని చూడగానే, ఆ దేవకన్యలు సిగ్గుపడి, గబగబా తమ చీరలు కప్పుకుని తప్పుకుంటారు......అదిచూసి, వ్యాసుడు ఆ దేవకన్యల్ని" నా కొడుకు యవ్వనంలో ఉన్నాడు,పైగా నగ్నంగా ఉన్నాడు...అయినా ఆయన్ను చూసి మీరు సిగ్గుపడలేదు....కానీ నేను వస్త్రధారిని, పైగా వృద్ధ్హుణ్ణి. నన్ను చూసి సిగ్గుపడి మీరు చీరలు కప్పుకున్నారు. కారణమేంటి" అని అడుగుతాడు.....దానికి వాళ్ళు," ఓ వ్యాసమునీంద్రా! నీ కొడుక్కి ఈమె స్త్రీ, వీడు పురుషుడు అన్న భేదదృష్టి ఉండదు...ఆయన నిర్వికల్పుడు...కనుక ఆయనకి నీకు చాలా అంతరం ఉంది." అన్నార్ట........అలాంటి వాడు శుకుడు....

ఒంటి బోవన్------ఒక్కడే పోతుంటే; "ఏకమేవా ద్వితీయం బ్రహ్మ" అన్న ఉపనిషదుక్తికి అర్థంగా ఉన్నాడట.....తానే బ్ర్హహ్మపదార్థం అన్న స్థితిని పొందినవాడని అర్థం....

అలా పోతున్న కుమారుణ్ణి వ్యాసుడు చూసి,
మహాభీతిన్------- మహాభయంతో; భయము అంటే సంసారంలో నిమగ్నమైపోయి వేరేది పట్టకపోవడం........భయమంటే వేరే ఒకటి ఏదో కాదు, అజ్ఞానమే!!!!

ఒహో కుమార! అనుచున్ వ్యాసుండు సీరంగ-----ఓ కుమారా అంటూ వ్యాసుడు పిలుస్తూ వెళుతుంటే....

వృక్షములుం దన్మయతం ప్రతిధ్వనులు సక్కంజేసె మున్ను------- చుట్టూ ఉన్న చెట్లన్నీ కూడా తన్మయత్వంతో ప్రతిధ్వనులు చేస్తున్నాయట!

అట్టి భూతమయున్------ ఈ రీతిగా శ్రీ శుకమహర్షి పంచభూతాల్లో లీనమయ్యాడు.......అసలు పంచభూతాలకి,ఆయనకి భేదమే లేకపోయింది.......

బాదరాయణిఁ దపోధన్యాగ్రణిన్ ధీమణిన్------ మహా తపశ్శక్తి సంపన్నుడై, సర్వ మునులకీ కిరీటమణి వంటివాడైన ఆ బాదరాయణికి, ఆ శుకమహర్షికి.......

మ్రొక్కెద--------- శిరసువంచి మనసారా నమస్కరిస్తున్నాను..........

ఇది అద్వైతంలోని పరమరహస్యాలన్నీ చెప్తున్న పద్యం.......ఈ పద్యంలోని రహస్యాలన్నీ ఉపనిషత్తుల్లో ఉన్నై....అసలు ఈ ఒక్క పద్యానికి ఉపనిషత్తులన్నీ వ్యాఖ్యానాలనాలి!!!!!!

12 కామెంట్‌లు:

  1. బావుందండి...మీ భాగవత గమనం ఇక్కడనుండి మరింత శోభస్కరంగా ఉండబోతున్నదన్న మాట. పద్య పాదాలకు, పదాలకు విడివిడిగా అర్ధం చెప్పారు. మొత్తంగా తాత్పర్యం కూడా వ్రాస్తే పరిపూర్ణత్వం కనపడుతుందన్నది నా భావన.

    రిప్లయితొలగించండి
  2. శ్రీ కౌటిల్య గారికి, నమస్కారములు.

    చాలా చక్కటి, చాలా గొప్ప పద్యాన్ని ప్రస్తావించారు. ఇందులో నాకు నచ్చిన పదం " భయమున ". భయమున అంటే అజ్ఞానం అని, సంసారమనే అజ్ఞానం అనీ అర్ధం చెప్పటంలో చాలా లోతైన అర్ధమున్నది. శుకునికి సంసార భయమన్నది లేదుకాబట్టే, ఆయనను చూసికూడా ఆ స్త్రీలు సిగ్గుపడలేదు; కానీ, వ్యాసునిలో ఎంతోకొంత సంసార మోహం వున్నది కాబట్టే, ఆ స్త్రీలు సిగ్గుపడ్డారు. శుకుడు అంత గొప్పవాడు కాబట్టే, ఆయనని "శుకబ్రహ్మ" అని పిలిచారు.

    భవదీయుడు,
    మాధవరావు.

    రిప్లయితొలగించండి
  3. కౌటిల్య గారూ,
    ద కు ధ వత్తు (ద్ధ) ఇచ్చేటపుడు మీరు ఒక h అదనంగా టైపు చేస్తున్నట్లనపిస్తుంది. నాకు ద్ధ్హ ఇలాకనిపిస్తుంది. మిగతా వారికీ అంతే కనిపిస్తుందా లేక నాకేనా?

    రిప్లయితొలగించండి
  4. @కొత్తపాళీ గారు, @మాధవరావు గారు
    ధన్యవాదాలు...మీలాంటి పెద్దల ప్రోత్సాహం చూస్తుంటే ఇంకా రాయాలనిపిస్తోంది..
    @రాజన్ గారు,
    మీరు చెప్పినట్టే రాయటానికి ప్రయత్నిస్తాను...
    @రవిచంద్ర గారు,
    మీరు చెప్పింది కరెక్టే..వత్తు కోసం అదనంగా h వాడుతున్నా..ఒకటే వాడితే వత్తు కనపడక,పదంలో బిగువు పోతోంది....అందుకే..

    రిప్లయితొలగించండి
  5. యం ప్రవ్రజన్తమనుపేతమపేతకృత్యం
    ద్వైపాయనో విరహకాతర ఆహుహావ।
    పుత్రేతి తన్మయతయా తరవో೭భినేదు
    స్తం సర్వభూతహృదయం మునిమానతో೭స్మి।।

    బాగుందండీ.

    రిప్లయితొలగించండి
  6. రాఘవ గారికి,
    ధన్యవాదాలు....మీరు పైన రాసిన శ్లోకం అంతగా అర్థం కాలేదు...అది ఎందులోది?..సంస్కృతం నాకు అంతబాగా రాదండీ...స్థూలంగా అర్థం చేసుకోగలను కానీ, సూక్ష్మమైన భావాల్ని పట్టుకోలేను...దయచేసి అర్థం తెలుపగలరు...

    రిప్లయితొలగించండి
  7. మీరు వ్రాసిన తెలుగుపద్యానికి సంస్కృతమూల మీ శ్లోకం. వ్యాసులవారి భాగవతమహాపురాణమునందలి ప్రథమస్కన్ధము ద్వితీయాధ్యాయములోనిదండీ.

    రిప్లయితొలగించండి
  8. ధన్యవాదాలు రాఘవ గారూ.....నాకు సంస్కృత భాగవతంతో పెద్దగా పరిచయం లేదు...ఎప్పుడో ఒకసారి, రాజవంశ చరిత్ర కావాల్సొచ్చి ద్వాదశస్కంధం తీసి చదివా....మీరు రాసింది అదేనేమో అనుకున్నా, కాని ఒకవేళ మీరే స్వంతగా రాసారేమో అనిపించింది...అందుకే అడిగా...మీరు చెప్పింతర్వాత అన్వయించుకుని చదువుతుంటే బాగా అర్థమౌతోంది....

    రిప్లయితొలగించండి
  9. కౌటిల్య గారు చాలా రోజుల నుండి మీ బ్లాగ్ చూస్తున్నాను..చాలా మంచి పద్యాలు,వాటి అర్ధాలు చెప్పుతున్నారు...చక్కని బ్లాగ్ ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  10. శుకుడు వ్యాసుడు దేవకన్యలు కలయికని చాల చక్కగా వర్ణించారు. మహాపురుషులు వస్తుంటే అలా వారినుండి విజ్ఞాన కిరణాలు (తరంగాలు) వస్థూ వుంటాయి. అవి గుర్తించే శక్తి దేవకన్యలకి ఉంది.. వాటినే మనం radiation అంటాము. అవి మన చుట్టుతా గూడా కనపడు తుంటాయి గుర్తించ గలిగితే. రాజన్ గారు అన్నట్టు చివరలో అన్ని కలిపి తాత్పర్యము ఉంటె చాలా బాగుంటుంది. థాంక్స్.
    రామకృష్ణ

    రిప్లయితొలగించండి