ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

19, జులై 2010, సోమవారం

పుత్ర హంతకుడైన అశ్వత్థామను అర్జునుడు బంధించి తెచ్చుట











"వెఱచినవాని దైన్యమున వేఁదుఱు
నొందినవాని నిద్ర మై

మఱచినవాని సౌఖ్యముగ మద్యము ద్రావినవాని భగ్నుఁడై

పఱచినవాని సాధు జడభావము వానిని గావుమంచు వా

చఱచినవానిఁ గామినుల జంపుట ధర్మముగాదు ఫల్గునా!"



ఇవి, పుత్రహంతకుడైన అశ్వత్థామను బంధించి, చంపబోతున్న అర్జునుడికి భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మసూక్ష్మాలు......
" అర్జునా! భయపడ్డవాణ్ణి, ఉన్మత్తుడై అతిదీనంగా ఉన్నవాణ్ణి, మైమరిచి నిద్రించేవాణ్ణి, మధువు సేవించి మత్తులో ఉన్నవాణ్ణి, శక్తి ఉడిగిపోయి భంగపడి ఉన్నవాణ్ణి, సాధువై తపస్సు చేసుకుంటూ కదలక,మెదలక ఉన్నవాణ్ణి, రక్షించమని గొంతెత్తి అడిగినవాణ్ణి, స్త్రీలను చంపటం ధర్మంకాదు."


"నారదమహర్షి వెళ్ళిన తర్వాత వ్యాసుడు, బ్రహ్మనదియైన సరస్వతీనదికి పడమటి ఒడ్డునున్న తన ఆశ్రమానికి వెళ్ళాడు...అది ఫలవంతాలైన రేగుచెట్లతో (అందుకే వ్యాసుణ్ణి "బాదరాయణుడు" అంటారు. బదరీ వృక్షం=రేగుచెట్టు) నిండిఉంది...దానిపేరు శమ్యాప్రాసం.....అక్కడ వ్యాసుడు పవిత్ర సరస్వతీ జలాల్లో స్నానమాచరించి,సంధ్య వార్చుకుని వచ్చి ఒడ్డున కూర్చుని, భక్తినిండిన మనస్సుతో ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించాడు....మాయామోహితుడైన జీవికి హరిభక్తి తప్ప వేరే ఉపశమనం లేదని నిశ్చయించుకుని........... ఈ భూమిమీద ఎవ్వరైనా,ఎప్పుడైనా,ఎక్కడైనా విన్న,చదివినంత మాత్రాన, ఈ సర్వ భవబంధాల్ని తొలగించి ముక్తిని ప్రసాదించే ఆ హరిభక్తిని కలిగించేటువంటి భాగవతమహాపురాణాన్ని రచించాడు....దానిని తన కుమారుడైన శుకమహర్షి చేత చదివించాడు...." అని సూతమహర్షి వివరించాడు...అది విన్న శౌనకుడు" శుక మహర్షి సర్వ విరాగి కదా! ఏ కారణంచేత భాగవతాన్ని పఠించాడు" అని అడిగాడు.....

అప్పుడు సూతుడు," మునులు నిరపేక్షులు...వాళ్ళు కారణమేమీ లేకుండానే హరిని కీర్తిస్తుంటారు...ఏదో ప్రయోజనం ఆశించి చెయ్యరు! అలా ఆ హరితత్పరుడైన బాదరాయణి(శుకుడు), త్రైలోక్య మంగళకరమైన భాగవతాన్ని భక్తితో పఠించాడు.....వేదాలు వెయ్యిమార్లు చదివినా ముక్తి మార్గం సులభంకాదు..కానీ ఈ భాగవతవేదాన్ని శ్రద్ధ్హతో ఒక్కమారు చదివినా మోక్షమార్గం ఎంతో సులభమౌతుంది.......ఇక పరీక్షిత్తు జన్మకర్మ ముక్తినీ, పాండవుల మహాప్రస్థానాన్నీ, కృష్ణకథోదయాన్నీ చెప్తాను వినండి." అని పలికి ఇంకా ఇలా చెప్పసాగాడు......

"కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసింది....ఎన్నో అక్షౌహిణుల సైన్యం నాశనమయ్యింది..ఎందరో వీరులు స్వర్గగతులయ్యారు.....భీముడి గదాఘాతానికి దుర్యోధనుడు తొడలువిరిగి నేలకూలాడు....అప్పుడు అశ్వత్థామ తన రాజు,మిత్రుడు ఐన దుర్యోధనుడికి ప్రియం చేకూర్చాలని భావించి, నిద్రపోతున్న ద్రౌపదీపుత్రుల శిరసులు ఖండించి తెచ్చి సమర్పించాడు.....ఇది మహా కౄరకర్మ అని లోకులు నిందించారు.....

తనయుల చావువార్త విన్న ఆ ద్రుపదరాజపుత్రి ఎంతో కలతపడ్డది.కన్నీళ్ళు చెక్కిళ్ళవెంట ధారగా కారుతుండగా దుఃఖించి,దుఃఖించి నేలపైబడి మూర్ఛిల్లింది....అది చూసిన అర్జునుడు ద్రౌపదిని కూర్చుండబెట్టి,సేదదీర్చి, తలనిమురుతూ, మెత్తటి గొంతుకతో ఇలా అన్నాడు.."మహారాజ పుత్రివి, మరో మహారాజు ఇల్లాలివి...ఇలా బేలవై దుఃఖించుట తగునా? ఆ ద్రోణపుత్రుడు నిర్దయుడై బాలుర్ని హతమార్చాడు...నేడు, నా గాండీవం వదిలే భీకర శరాలతో వాని శిరస్సు ఖండించి తెచ్చి నీ పాదాల దగ్గర పడవేస్తాను...అది చూచి నువ్వు ఆనందనర్తనం చెయ్యాలి.."....అని ద్రౌపదిని ఓదార్చి అర్జునుడు, కవచం తొడిగి,గాండీవం ధరించి....తన సఖుడు,భగవంతుడు ఐన ఆ శ్రీకృష్ణుడు సారథికాగా, కపిధ్వజయుతమైన రథాన్ని అశ్వత్థామ వద్దకు పరుగెత్తించాడు...

తనని చంపటానికి వస్తున్న అర్జునుణ్ణి చూసి అశ్వత్థామ, భయంతో ప్రాణాలరచేత పట్టుకుని,రథమెక్కి పారిపోవటం మొదలెట్టాడు....అలా ఓపికున్నంత వరకూ వెళ్ళాడు...గుర్రాలు కూడా అలిసిపోయాయి.... వెనక అర్జునుడు తరుముతూ వస్తున్నాడు....ఇక ప్రాణరక్షణకి వేరే మార్గంలేదని నిశ్చయించుకుని, జలాన్ని అభిమంత్రించి, అర్జునుడి మీదకు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని(ప్రయోగమే కాని,ఉపసంహారం తెలియక పోయినా ప్రాణరక్షణకోసం) ప్రయోగించాడు...ఆ అస్త్రాగ్ని దిక్కులన్నీ వ్యాపించి, ఆకాశమంతా కమ్ముకుని మహాభీకరంగా వస్తుంటే చూసి అర్జునుడు ఆ వాసుదేవునితో,"కృష్ణా! భక్తాభయప్రదా!పరమపురుషుడవు, నీ ప్రబొధంతో మాయను అణచివేస్తావు..... ఇదేదో మహాగ్ని భూమ్యాకాశాలూ,దిక్కులన్నీ నిండి ఎదురుగా వస్తున్నది..ఏంటో అర్థం కాకుండా ఉంది....నాకు త్వరగా,వివరంగా చెప్పు దేవేశా!" అని ప్రార్థించాడు...

అప్పుడు ఆ శ్రీహరి," అర్జునా! ప్రాణేఛ్ఛతో పారిపోతున్న ద్రోణపుత్రుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు...ఇది ఆ మహాస్త్రాగ్ని...తిరుగు బ్రహ్మాస్త్రంతోగానీ దీన్ని నివారించలేము..కనుక త్వరగా నీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు." అన్నాడు....అప్పుడు అర్జునుడు ఆ శ్రీహరికి ప్రదక్షిణచేసి, జలాన్ని అభిమంత్రించి. అశ్వత్థామ వదిలిన బ్రహ్మాస్త్రంపైకి తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు.....అప్ఫుడా రెండు మహాస్త్రాలూ, తమ అగ్నితో భూనభోంతరాళాలు నింపుతూ తలపడగా లోకమంతా గడగడలాడింది....ప్రజలు యుగాంతమేమోనని భయపడ్డారు....అప్పుడు ఆ శ్రీహరి ఆజ్ఞమేరకు, అర్జునుడు రెండు అస్త్రాలనీ ఉపసంహరించాడు....అప్పుడు ఆ ధనంజయుడు,రోషారుణిత నేత్రుడై, అశ్వత్థామను తఱిమి పట్టుకుని బంధించి, శిబిరానికి తీసుకువెళ్ళి వధిస్తానని పలకగావిని కృష్ణుడు ఇలా అన్నాడు.."అర్జునా! ఎదురాడలేని పసిపాపలని, నిద్రలో ఉన్నవారిని,రాత్రివేళ చంపిన ఈ పాతకుణ్ణి వదలవద్దు...కానీ ప్రాణభయంతో పారిపోయేవాడిని వధించరాదని ధర్మం చెప్తోంది...కనుక ఈ విప్రుణ్ణి రాజధర్మానుసారం దండించు...".

అని ఇలా కృష్ణుడు ఆనతివ్వగా అర్జునుడు, బ్రాహ్మణుడు ఎంత అపరాధియైనా, వధింపదగడనే ధర్మాన్ని తలచి, చంపక, ద్రౌపదికి తానిచ్చినమాట గుర్తుకుతెచ్చుకుని బంధితుడైన అశ్వత్థామను తీసుకుని శిబిరం దగ్గరికి వచ్చి,

"సురరాజసుతుఁడు సూపెను
దురవధి సుతశోకయుతకు ద్రుపదుని సుతకున్
బరిచలితాంగ శ్రేణిం
బరుష మహాపాశబద్ధ పాణిన్ ద్రౌణిన్."

5 కామెంట్‌లు:

  1. యుద్ధభూమిలో కూడా నీతి నిజాయితీ పాటించటం. మన సంస్కృతి ఎంత గొప్పది. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    రిప్లయితొలగించండి
  2. పాఠకుల కోసం నాకు తెలిసిన మరింత సమాచారం. ఉపపాండవులు అనగా వీరు.
    1. ప్రతివింధ్యుడు - (ధర్మరాజు పుత్రుడు)
    2. శ్రుతసోముడు - (భీముని పుత్రుడు)
    3. శ్రుతకర్ముడు - (అర్జునుని పుత్రుడు)
    4. శతానీకుడు - (నకులుని పుత్రుడు)
    5. శ్రుతసేనుడు - (సహదేవుని పుత్రుడు)
    భీమార్జునులు అశ్వత్థామను పట్టుకొన్నారు. అశ్వథ్థామను వదిలేయడానికి ఇంకో కారణం: గురుపుత్రుడన్న కారణంగా చంపకుండా అతని తలపైనున్న సహజ సిద్ధమైన మణిని తీసుకొని వదిలేశారు.

    రిప్లయితొలగించండి
  3. @రామకృష్ణగారు...
    అవునండీ మన సంస్కృతి ఏ పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడిచిపెట్టద్దనే చెప్తుంది..

    @రవిచంద్ర
    మంచి సమాచారాన్ని అందించారు..ధన్యవాదాలు..

    @అశ్విన్,వినయ్..
    ఏదో మీ ప్రోత్సాహబలం....

    రిప్లయితొలగించండి